హైదరాబాద్, ఏప్రిల్ 16 : వచ్చే నెల 12న కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఎన్నికల కోసం రెండు జాతీయ పార్టీలు ( బీజేపీ, కాంగ్రెస్) ప్రచారాలను ముమ్మరం చేశాయి. కాగా ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ కూడా ఆ రెండు పార్టీలకు గట్టిపోటీనిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే జేడీఎస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమన్న ఒవైసీ.. జేడీఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. "రెండు జాతీయ పార్టీలు(కాంగ్రెస్, బీజేపీలు) కర్ణాటకలో పూర్తిగా విఫలమయ్యాయి. ఏఐఎంఐఎం జేడీఎస్కు మద్ధతు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు జేడీఎస్ తరుపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటాం" అని అసదుద్దీన్ వెల్లడించారు.