అల్లుడితో కలిసి కొడుకుని హతమార్చిన తల్లి

SMTV Desk 2018-04-15 18:43:23   Mom Paid One Lakh To Contract Killer To Murder Son

ఉదయ్‌పూర్, ఏప్రిల్ 15‌: రాజస్తాన్‌లో ఓ తల్లి ఆస్తి కోసం అల్లుడితో కలిసి కన్నా కొడుకునే చంపించింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రతాప్‌ఘడ్ జిల్లా చోటిసాద్రి గ్రామానికి చెందిన మోహిత్‌(21) తన తల్లి ప్రేమ్‌లత సుతార్‌తో తరచూ గొడవ పడేవాడు. తండ్రి చనిపోయాక ఈ గొడవ మరింత ముదిరింది. దీంతో విసుగు చెందిన ప్రేమ్‌లత కూతురి దగ్గరికి వెళ్లి అక్కడే ఉంటుంది. కాగా నెల రోజుల క్రితం ఆమె తన ఊళ్లో ఉన్న భూమిని అమ్మడానికి ప్రయత్నించింది. దీనికి మోహిత్‌ అడ్డుపడ్డాడు. దీంతో ఎలాగైనా కొడుకు అడ్డుతొలగించుకోవాలని అల్లుడితో కలిసి కుట్రపన్నింది. మోహిత్‌ను అంతమొందించడం కోసం అదే ప్రాంతానికి చెందిన రౌడీ గణపత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ను ఆశ్రయించారు. హత్య కోసం అతనితో లక్ష రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 6న మోహిత్‌ గ్రామానికి దగ్గరలో ఉన్న దాబాకి వెళ్లాడు. అక్కడే ఉన్న గణపత్‌, అనిల్‌లు ప్లాన్‌ ప్రకారం మోహిత్‌కి మద్యం తాగించి గొంతు పిసికి చంపేశారు. సీసీ పుటేజీ సాయంతో నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.