న్యూ ఢిల్లీ, జూలై 3 : భారతీయ రైల్వేల ఆధునీకరణ విషయంలో కేంద్రం రానున్న రోజులో మరి కొన్ని చర్యలు తీసుకోనున్నది. ఇకపై తక్కువ చార్జీతోనే రైలు ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి ఎకానమీ ఏసీ క్లాస్ రానుంది. ప్రయాణికులతో రైల్వే సిబ్బందికి కూడా డిజైనర్ యూనిఫాంలు రూపొందించాలని రైల్వే సిబ్బంది యోచిస్తున్నది. చాలా దూరం ప్రయాణించే ప్రయాణికుల కోసం రైళ్లలో ఏసీ క్లాస్ ల సంఖ్యను క్రమంగా పెంచుకొంటూ వస్తున్న రైల్వేలు త్వరలో ఆటోమేటిక్ తలుపులతో కూడిన పూర్తి ఏసీ క్లాస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నాయి. ప్రస్తుతం మూడు రకాల ఏసీ-3, ఏసీ-2, ఏసీ-1 క్లాస్ లున్నాయి. ఈ మూడు రకాల ఏసీ క్లాస్ లతోపాటు అదనంగా ఇకపై ఎకానమీ ఏసీ క్లాస్ లను ఏర్పాటు చేస్తారు. ఈ నాలుగు రకాల్లో ప్రయాణికులు ఏరకమైన ఏసీ క్లాస్ నైనా ఎంచుకోవచ్చు. ఇప్పుడు రాజధాని, శతాబ్ది, హమ్ సఫర్, తేజస్ రైళ్లు మాత్రమే పూర్తి ఎయిర్ కండిషన్డ్ కోచ్ లుగా కలిగినవి. వీటిలో బోగీలు తక్కువ కాబట్టి ఎంపిక చేసిన రూట్లలో ముందుగా పూర్తి ఏసీ క్లాస్ రైళ్లను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకొంటున్నారు. అక్టోబర్ నుంచి పండుగల సీజన్ నాటికి రైల్వే సిబ్బందికి స్పోర్టింగ్ డిజైనర్ జాకెట్లు, టీషర్టులతో కూడిన యునిఫారాలు అందరికీ ఇవ్వకుండా రైల్లో విధులు నిర్వహించే టీటీఈ, గార్డులు, డ్రైవర్లు, క్యాటరింగ్ సిబ్బందికి, స్టేషన్ మాస్టర్లు తదితరులకు మాత్రమే ఈ యూనిఫారాలు ఇస్తారు. ఫ్యాషన్ డిజైనర్ రితూ బేరీతో ఈ కొత్త తరహా యూనిఫారాలను రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా విమానాల్లో ఎకానమీ క్లాస్ ఉన్నట్టుగానే ఎకానమీ ఏసీ క్లాస్ కొత్తరకమైన యూనిఫాంలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.