చెన్నై, ఏప్రిల్ 11: కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) జట్టు ఐపీఎల్ సీజన్లో ఓ కొత్త రికార్డును సృష్టించింది. చెపాక్ వేదికగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ లో (కేకేఆర్) 202 పరుగులు చేసి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. వంద పరుగుల లోపే ఐదు వికెట్లు నష్టపోయి రెండొందల మార్కును చేరడంతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఒక జట్టు వంద పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయి రెండొందల పరుగులకు పైగా చేయడం ఇదే మొదటి సారి. ఈ మ్యాచ్లో కేకేఆర్ 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా, నిర్ణీత ఓవర్లలో 202 పరుగుల భారీ స్కోరును చేసింది. ఆండ్రీ రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి.. 36 బంతుల్లో 11 సిక్సర్లు, 1 ఫోర్తో 88 పరుగులు సాధించి చివరి వరకూ అజేయంగా నిలబడ్డాడు. గతంలో 2008లో డెక్కన్ చార్జర్స్ 95 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి చివరకు 181 పరుగులు చేసింది. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో డెక్కన్ చార్జర్స్ ఆ ఘనత సాధించింది. తర్వాత 2015లో సన్రైజర్స్తో మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 81 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సందర్భంలో 180 పరుగుల్ని చేసింది.