హైదరాబాద్, ఏప్రిల్ 10 : టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా..! కానీ ఒక ఓవర్ కు ఏడూ బంతులు వేసిన ఘటన జరిగింది. అది ఎదో గల్లీ ఆటలో కాదు. ఐపీఎల్ మ్యాచ్ లో.. క్రికెట్ అంటే జెంట్లమన్ గేమ్. జరిగే ప్రతి మ్యాచ్ లో తప్పిదాలు జరగకుండా నిర్వాహకులు జాగ్రతలు తీసుకోవాలి. కానీ ఐపీఎల్లో ఫీల్డ్ అంపైర్ల తప్పిదం మరోసారి బయటపడింది. టోర్నీలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఓవర్లో అంపైర్ ఆరుకి బదులు ఏడు బంతులు వేయించారు. అసలేం జరిగిందంటే.. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదన దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆది నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 12వ ఓవర్ వేసేందుకు లాలిన్ బంతిని అందుకున్నాడు. ఈ ఓవర్లో అంపైర్ బౌలర్ చేత ఏకంగా ఏడు బంతులు వేయించాడు. ఏడో బంతికి ధావన్ ఒక పరుగు తీశాడు. టీ-20 మ్యాచ్ అంటేనే ఒక్క బంతిలో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా ఇటువంటి పొరపాట్లు రాకుండా నిర్వాహకులు వ్యవహరించాలి.