హైదరాబాద్, ఏప్రిల్ 10 : తెలుగుతేజం, బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ చరిత్ర లిఖించానున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ( బీడబ్ల్యూఎఫ్) ఈ వారం విడుదల చేసే ర్యాకింగ్స్ లో అగ్రస్థానం సొంతం చేసుకోనున్నాడు. సోమవారం కామన్వెల్త్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీం విభాగంలో మలేషియాను 3-1తేడాతో భారత బ్యాడ్మింటన్ జట్టు చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత లీ చాంగ్ వీకి షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజా విజయంతో శ్రీకాంత్ దాదాపు నంబర్వన్ స్థానానికి చేరుకున్నట్లే. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. మొత్తం 76, 895 పాయింట్లతో శ్రీకాంత్ మొదటి స్థానం కైవసం చేసుకోనున్నాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ స్థానంలో ఉన్న విక్టర్ అక్సెల్సన్ ప్రస్తుతం 77,130 పాయింట్లతో ఉన్నాడు. అయితే గాయం కారణంగా కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న విక్టర్.. తాజా ర్యాకింగ్స్లో 1,660 పాయింట్లు కోల్పోబోతున్నాడు. దీంతో శ్రీకాంత్ నంబర్ వన్ ర్యాంక్ ను అందుకోనున్నాడు.