హైదరాబాద్, జూలై 2 : దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమలు కారణంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం రానుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బందరు దత్తాత్రేయ తెలిపారు. ఈ జీఎస్టీ వల్ల కేవలం ఆర్థిక వ్యవస్థ లాభం ఒక్కటే కాకుండా భారీగా ఉద్యోగాలను సృష్టించనుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు. జీఎస్టీ ద్వారా వచ్చే మూడు నెలల్లో లక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని శనివారం ఆయన మీడియాకు తెలిపారు. ఈ ఉదోగాల్లో ప్రధానంగా అకౌంటెన్సీ రంగంలో దాదాపు 60వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయనే అంచనాలున్నాయని మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా జీఎస్టీ అమలే ఒక చారిత్రక అధ్యాయమని పేర్కొన్నారు. జీఎస్టీ కారణంగా బోర్డర్ చెక్ పోస్టులను రద్దు చేయడంతో, వస్తువుల అంతర్ రాష్ట్ర రవాణా ఆలస్యం కాదని తెలిపారు. జీఎస్టీ కొత్త పన్నుల విధానం అమలు నేపథ్యంలో వివిధ సంస్థలతో అనుబంధంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన జీఎస్టీ వర్క్ షాపు నిర్వహించినట్టు చెప్పారు. గత ఆరు నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలకు 1,118 వర్క్ షాప్లను నిర్వహించామన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్లమెంట్ సెంట్రల్ హల్లో జీఎస్టీ ప్రయోగ కార్యక్రమానికి హాజరు కాని కాంగ్రెస్, వామపక్ష పార్టీలపై కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ మండిపడ్డారు.