అదే నా ఫార్ములా: ధావన్‌

SMTV Desk 2018-04-10 14:36:42  shikhar dhawan, sun risers hyderabad, ipl, rajastan royals

హైదరాబాద్‌, ఏప్రిల్ 10 : దూకుడుగా ఆడటమే తన ఫార్ములా అని సన్‌రైజర్స్‌ ఆటగాడు శిఖర్ ధావన్ తెలిపాడు. ఐపీఎల్ లో భాగంగా సోమవారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ ఆటగాడు శిఖర్ ధావన్ 57 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఇది ధావన్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో 29వ అర్ధశతకం. మ్యాచ్‌ తర్వాత ధావన్‌ మాట్లాడుతూ..‘క్రీజులో వీలైనంత ఎక్కువ సమయం ఉండాలి. ఉన్నంతసేపు దూకుడుగా ఆడాలి. ప్రస్తుతం ఇదే నా ఫార్ములా. ఇలా చేయడం వల్ల జట్టుకే కాదు నాకు కూడా లాభమే. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించవచ్చు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి నా ఆటలో దూకుడు పెంచాను. ఆ తర్వాత శ్రీలంక పర్యటనలోనూ అది కొనసాగించా. ఇప్పుడు ఐపీఎల్‌ వంతు. దూకుడుగా ఆడాలన్న నా ఫార్ములాను భవిష్యత్తులోనూ కొనసాగిస్తా. విజయంతో టోర్నీని ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. టోర్నీలోని మిగతా మ్యాచ్‌ల్లోనూ మా జట్టు బాగా రాణించాలని కోరుకుంటున్నా’ అని ధావన్‌ వెల్లడించాడు.