చెన్నై, ఏప్రిల్ 10: మే 3లోగా కావేరి బోర్డు ముసాయిదాను అందించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశించింది. కావేరి నది జలాల విషయంలో కర్ణాటక- తమిళనాడు మధ్య జరుగుతున్నా పోరు ఎప్పటినుండో నడుస్తుంది. ప్రస్తుతం ఈ జలవివాదంపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కావేరీ జలాల్లో కర్ణాటకకే ఎక్కువ శాతం నీరు కేటాయించిన నేపథ్యంలో.. తమిళనాడులో కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా సుప్రీం కోర్టు స్పందించింది. మేనేజ్మెంట్ బోర్డు విషయమై ముందే తమను ఎందుకు సంప్రదించలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కావేరీ బోర్డు ఏర్పాటు అంశంపై కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. మే 3లోగా కావేరి బోర్డు ముసాయిదాను అందించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి తెలిపింది. అంతవరకు ప్రజలు ఎటువంటి ఘర్షణలకు పాల్పడవద్దని ఇరురాష్ట్రాలను సుప్రీం ధర్మాసనం కోరింది.