శ్రీనగర్, ఏప్రిల్ 10: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉగ్ర దేశం పాకిస్థాన్ మరోసారి ఉల్లంఘించింది. మంగళవారం సరిహద్దులను కాల్పులతో హోరెత్తించింది. దీంతో సుందర్బని సెక్టార్ లో నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇద్దరు భారత జవాన్లు మృతిచెందారు. నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. దాడిలో అమరులైన రైఫిల్మెన్ వినోద్ సింగ్, జాకీ శర్మలు జమ్మూకశ్మీర్కు చెందినవారు. వినోద్ సింగ్(24) అక్నూర్ జిల్లాకి చెందిన దనాపూర్ వాసి. జాకీ శర్మ(30) హిరానగర్ జిల్లాకి చెందిన సన్హైల్ గ్రామ నివాసి. భారత్ వైపు నుంచి ఎలాంటి కాల్పులు లేకపోయిన పాక్ ఈ అకృత్యానికి దిగిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.