ముంబయి, ఏప్రిల్ 10: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది కూలీలు దుర్మరణం చెందారు. ముంబయి- బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణ కూలీలతో వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ ఈ ఉదయం 4.30గంటల ప్రాంతంలో సతారా జిల్లా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఖాంబట్కీ ఘాట్ వద్ద మూల మలుపు తిరుగుతుండగా వాహనం అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా .. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.