పనాజీ, ఏప్రిల్ 7: దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని గోవా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లోని పోర్టులను కూడా ఈ మేరకు అప్రమత్తం చేసినట్లు ఓడరేవుల శాఖ మంత్రి జయేష్ సల్గాంకర్ తెలిపారు. గతంలో స్వాధీనం చేసుకున్న ఓ భారతీయ బోటును పాకిస్తాన్ విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రభుత్వాలను హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు తీర ప్రాంతాల్లో గస్తీని పెంచాయి. గోవాతో పాటు, గుజరాత్, ముంబై తీరాలకు కూడా దేశ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి.