పట్నా, ఏప్రిల్ 7: బిహార్ ప్రభుత్వం పోటీ పరీక్షలకు దరఖాస్తులు చేసుకునే మహిళలకు పరీక్ష ఫీజులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన మహిళలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేబినెట్ సెక్రటేరియట్ విభాగం ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ వెల్లడించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(బీపీఎస్సీ), బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్(బీఎస్ఎస్సీ) నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు మహిళలకు ఫీజు తగ్గింపు ఉంటుందని చెప్పారు. ప్రిలిమినరీ పరీక్ష ఫీజు మహిళలకు రూ.600 నుంచి రూ.150కి తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే మెయిన్స్ పరీక్షకు రూ.750 నుంచి రూ.200కు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(బీఏఎస్) కేడర్ పునర్నిర్మాణానికి వివిధ పోస్టులు భార్తీచేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.