న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: అవిశ్వాస తీర్మానం పై ఎలాంటి ప్రస్తావన లేకుండానే లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. అటు రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సభ మొదలవగానే అన్నాడీఎంకే ఎంపీలు ఎప్పటిలాగానే తమ ఆందోళన కొనసాగించారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ వెల్లో దూసుకువచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అరుపుల మధ్యే జాతీయ గేయం వందేమాతరం ప్రారంభంకావడంతో ఎంపీలు మిన్నకుండిపోయారు. ఆ తరువాత వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేక హోదాకోసం టీడీపీ ఎంపీలు, కావేరి బోర్డు కోసం అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను నిరవధికంగా వాయిదా వేశారు.