పీఏపల్లి, ఏప్రిల్ 6: నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం ఒద్దిపట్ల పడమటితండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్ కాలువలో పడటంతో 9 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో సుమారు 30 మంది ఉన్నట్లు సమాచారం. కూలీలు వద్దిపట్లలోని పడమటి తండా నుంచి పులిచర్లలోని మిరపచేనులో కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుల రోదనలు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 8మంది మృతదేహాలను స్థానికుల సాయంతో వెలికి తీశారు. మృతులు రమావత్ (50), రమావత్ కంస్లి(50), రమావత్ భారతి(35), రమావత్ సునీత(30), జరుకుల ద్వాలి(30), రమావత్ లక్ష్మిగా గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనలో సుమారు 15 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కాల్వలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో కొంతమంది కూలీలు నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.