ముంబై, ఏప్రిల్ 5 : బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి )కు మరో సారి కాసులపంట పండింది. భారత్ లో జరిగే మ్యాచ్ ల ప్రసార హక్కులను భారీ ధరకు స్టార్ ఇండియా నెట్ వర్క్ దక్కించుకొంది. ఇప్పటికే 2018-2022ల మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ల ప్రసార హక్కులు కూడా స్టార్ ఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అధికారక సమాచారం ప్రకారం రూ. 6,138.10 కోట్లకు హక్కులు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. 2018-2023 ఐదేళ్ల కాలానికి మీడియా స్టార్ నెట్వర్క్ సొంతం చేసుకుంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం టీమిండియా 2018-19కిగానూ 18 మ్యాచ్లు, 2019-20కి గానూ 26, 2020-21కిగానూ 14, 2021-22కిగానూ 23, 2022-23కిగానూ 21 మ్యాచ్లు ఆడనుంది. ఆలెక్కన 102 మ్యాచ్లకు సగటున ఒక్కోమ్యాచ్కు రూ.60.1 కోట్లను స్టార్ సంస్థ చెల్లించినట్లు తెలుస్తోంది. దేశివాళీ మ్యాచ్లతోపాటు మహిళా క్రికెట్ మ్యాచ్లను కూడా స్టార్ నెట్వర్క్ ప్రసారం చేస్తుంది.