న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఒకేసారి లోక్సభ, శాసన సభలకు పోటీ చేసే అభ్యర్థులకు భారత ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఒక్కో అభ్యర్థి ఒక్క స్థానం కోసం మాత్రమే పోటీచేయాలన్న ప్రతిపాదనలకు మద్దతు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టుకు నివేదించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి అటు ఎంపీ స్థానంతో పాటు ఇటు ఎమ్మెల్యే స్థానానికి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా పరిమితం చేయాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)కు సమాధానంగా ఈసీ స్పందించింది. ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించిన అభ్యర్థులు ఒక నియోజకవర్గాన్ని వదిలి మరో నియోజకవర్గానికి వెళ్లడమంటే ఓటర్లకు అన్యాయం చేయడమేనని ఎన్నికల సంఘం పేర్కొంది.