హైదరాబాద్, ఏప్రిల్ 4 : మెగా పవర్ స్టార్ కథానాయకుడిగా నటించిన "రంగస్థలం" చిత్రం మార్చి 30 న విడుదలై ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల చిత్రబృందం థాంక్స్ మీట్ ఏర్పాటు చేసి సక్సెస్ చేసిన ప్రేక్షకాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ కార్యక్రమానికి ఆదిపినిశెట్టి హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన మీడియా ముందుకొచ్చి "రంగస్థలం" అనుభూతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. దర్శకుడు సుకుమార్ మాయాజాలం ఈ సినిమా. ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునేలా ఉంది. ఈ సినిమా క్లైమాక్స్లో నా పాత్ర చనిపోయే సన్నివేశం నా తల్లిదండ్రులను కంగారు పెట్టింది. అందుకే ఈ సినిమా చేస్తున్నట్లు ముందుగా వాళ్లకు చెప్పలేదు. థియేటర్ లో ఆ సీన్ వచ్చేటప్పుడు నా తల్లిదండ్రుల ఎక్స్ప్రెషన్స్ చాలా గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ నటన అద్భుతం. అలాంటి పాత్ర చేయడం ఏ నటుడికైనా సవాల్ గానే ఉంటుంది. ఈ సినిమాతో నాకో తమ్ముడు దొరికాడు అనిపించింది. సమ౦త నటన గొప్పగా ఉంటుంది. చక్కటి సంగీతాన్ని దేవిశ్రీ అందించారు. ఇలాంటి సినిమాలు తీయాలంటే నిర్మాతలకు ఓపిక, సహనం ఉండాలి. అవన్నీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో ఉన్నాయి. అందుకే సినిమా ఇంత అత్యద్భుతంగా ఉందన్నారు.