నకిలీ వార్తలపై ఆదేశాలు రద్దు

SMTV Desk 2018-04-03 15:03:43  Fake news, Information and Broadcasting, Ministry Guide Lines

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: నకిలీ వార్తల విషయంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సమాచార శాఖను ఆదేశించారు. తప్పుడు వార్తలు ప్రచురిస్తే జర్నలిస్టుల అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని గత రాత్రి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ ఛానెళ్ల, పత్రికల ఎడిటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జర్నలిస్టు సంఘాల నుంచి పెద్ద ఎత్తున్న నిరసనలు ఎదురయ్యాయి. దీనికి తోడు ఈ నిర్ణయం పత్రికా స్వేచ్ఛను హరించటమేనంటూ రాజకీయ పక్షాలు రంగంలోకి దిగాయి. ఆ ఉత్తర్వుల్లో ఏవైనా మార్పులు సూచించాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ ఉదయం ట్వీట్‌ చేశారు. అయినా ఆందోళనలు చల్లారకపోవటంతో నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.