న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఆగస్ట్ 15న ప్రకటించిన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం పై బీజేపీ ఎంపీలే అశ్రద్ధ వహించారు. కేవలం 19 శాతం మంది ఎంపీలే ఈ పథకం కింద మూడు గ్రామాలను గుర్తించారు. మార్చి 2019 నాటికి ఎంపీలందరూ మూడు ఆదర్శ గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రధాని ప్రతి ఎంపీనీ కోరారు. అయితే 88 శాతం ఎంపీలు పథకం కింద కేవలం ఒక గ్రామానే ఎంపిక చేసుకోగా, 59 శాతం మంది ఎంపీలు రెండు గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం గమనార్హం. ఇక బీజేపీ ఎంపీల్లో ఏకంగా 191 మంది ఇంతవరకూ మూడో గ్రామాన్ని ఎంపిక చేసుకోలేదు. 84 మంది రెండవ గ్రామాన్నీ ఎంపిక చేసుకోలేదు. ఇక బీజేపీ రాజ్యసభ ఎంపీల్లో 12 మంది మూడు గ్రామాలనూ ఇప్పటివరకూ ఎంపిక చేసుకోలేదు. 20 మంది కనీసం రెండవ గ్రామాన్నీఇంతవరకూ గుర్తించనేలేదు. బీజేపీ ఎంపీలందరూ తలా ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక దశలవారీగా మూడు గ్రామాలను ఎంపిక చేసుకుని అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ధి మంత్రి అతుల్ కుమార్ తివారీ చెప్పారు.