హైదరాబాద్, ఏప్రిల్ 2 : ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్-11 సీజన్ ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ మహాసమరం కోసం ఇప్పటికే జట్లు సాధనను ముమ్మరం చేశాయి. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫ్రాంఛైజీ నిర్వాహకులు హైదారాబాద్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ జట్టు ధరించే జెర్సీని ఆవిష్కరించాడు. అనంతరం పలువురు అభిమానులకు ఈ మెగా హీరో జెర్సీలను అందజేసి సందడి చేశాడు. మరోపక్క సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఆదివారం నుంచి ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆ జట్టు నిర్వాహకులు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా సన్రైజర్స్ తన తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో ఏప్రిల్ 9న తలపడనుంది.