కేరళ, మార్చి 31: టెలికాం రంగంలో జియో ఓ సంచలనం. చౌకైన డేటా ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో జియోకు పోటీగా ఇప్పటికే పలు టెలికాం సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టాయి. తాజాగా ఇదే బాటలో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్లో రూ. 118 ప్రారంభ ధరతో కొన్ని ఆఫర్లు ప్రకటించింది. రూ. 118తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో రోజుకు 1జీబీ 3జీ/4జీ డేటా వస్తుంది. దీంతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ కూడా ఉంటాయి. ఇప్పటికే రూ. 98తో జియో ఆఫర్ ఉన్న విషయం తెలిసిందే. దీనికి పోటీగా బీఎస్ఎన్ఎల్ రూ. 118 ఆఫర్ తీసుకొచ్చింది. ఇక దీంతో పాటు రూ. 379, రూ. 551తో ప్రీపెయిడ్ ఆఫర్లు ప్రకటించింది. రూ. 379తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటా 30రోజుల పాటు వస్తుంది. ఇక రూ. 551తో రీఛార్జ్ ఆఫర్ కేవలం కేరళ సర్కిల్లో మాత్రమేనని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.