ఊరేగింపు వేడుకలో మతఘర్షణలు

SMTV Desk 2018-03-31 11:02:14  Bihar, Religious conflicts procession,ashwin kumar

నవాద, మార్చి 31: బిహార్‌ నవాద జిల్లాలోని ఓ గ్రామంలో ఊరేగింపు వేడుకలో మరోసారి మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. విగ్రహాన్ని అపవిత్రం చేశారంటూ ఆందోళనకారులు శుక్రవారం అనేక వాహనాలను ధ్వంసం చేశారు. ఓ హోటల్‌కు నిప్పు అంటించారు. గోదాపూర్‌ గ్రామంలో ఓ విగ్రహం కూలిపోయి ఉండటంతో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడంతో గొడవ ప్రారంభమైందని నవాద జిల్లా కలెక్టర్‌ కౌశల్‌ చెప్పారు. అన౦తరం ఆందోళనకారులు జాతీయ రహాదారి–31పైకి వెళ్లి వాహనాలపై రాళ్లు రువ్వ్వి వాటిని ధ్వంసం చేశారనీ, వార్తల సేకరణకు వచ్చిన స్థానిక విలేకరుల పై దాడికి పాల్పడి, ఓ హోటల్‌కు నిప్పు పెట్టారని చెప్పారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు.