చెన్నై, మార్చి 30 : ప్రభుదేవా.. నృత్య రారాజు.. దర్శకుడిగా, కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఈయన ఏం చేసిన ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం "మెర్క్యురీ". సైలెంట్ థ్రిలర్ల్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సనత్రెడ్డి, దీపక్ పరమేష్, ఇందుజ, రమ్య నంబీశన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా ఏప్రిల్ 12న జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ ప్రీమియర్గా "మెర్క్యురీ"ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రభుదేవా సరైన వ్యక్తి. ఒక పాట కానీ, డ్యాన్స్ కానీ ఉండదు. కార్పోరేట్ సంస్థలు చిన్న పట్టణాలను ఎలా దోచుకుంటున్నాయో చూపించాం" అంటూ పేర్కొన్నారు. అనంతరం ప్రభుదేవా మాట్లాడుతూ.. మెర్క్యురీ ఒక విభిన్నమైన చిత్రం. రెండు గంటల సినిమాలో ఒక్క డైలాగ్ కూడా ఉండదని దర్శకుడు కార్తీక్ నాకు చెప్పాడు. చాలా ఆశ్చర్యపోయా. కథ విన్న తర్వాత అతనిపై నాకు పూర్తి నమ్మకం కలిగింది" అంటూ వెల్లడించారు. స్టోన్బెంచ్ ఫిల్స్మ్ పతాకంపై కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.