ముంబై, మార్చి 28 : బాల్ టాంపరింగ్ వివాదంతో ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్ షాక్ మీద షాక్ తగులుతున్నాయి. ఇప్పటికే ఐసీసీ చిన్న శిక్ష వేసిన, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వీరిపై కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్ల కెప్టెన్సీ నుంచి తప్పించాయి. నాయకత్వం పోయినా ఐపీఎల్లో ఆడొచ్చు అని భావించిన వీరిద్దరికీ చుక్కెదురైంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించడంతో స్మిత్, వార్నర్లను ఈ సీజన్ ఐపీఎల్కు అనుమతించేది లేదని ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. "వార్నర్, స్మిత్లు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలు వారి స్థానాల్లో ఇతర ఆటగాళ్లను తీసుకోవాలని సూచించారు. ఈ ఇద్దరిని ఈ సీజన్ లో ఐపీఎల్లోకి అనుమతించేది లేదు" అని పేర్కొన్నారు. తాజా నిర్ణయం వల్ల సన్ రైజర్స్ (ఎస్అర్ హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెండేళ్ల నిషేధం తర్వాత వస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథిగా స్మిత్ ను తొలిగించిన ఆటగాడిగా కొనసాగుతాడని యాజమాన్యం అనుకుంది. మరోవైపు సన్ రైజర్స్ ను గతేడాది విజేతగా నిలపడంలో వార్నర్ పాత్ర మరువలేనిది. మరి ఆ జట్ల ఫ్రాంచైజీలు వారిస్థానంలో ఎవరని భర్తీ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.