న్యూఢిల్లీ, జూన్ 30 : దేశంలోని అధికార, ప్రతిపక్ష పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య వచ్చేనెల 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం అన్ని విధాల ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇరుపక్షాలు తమ అభ్యర్థులను బరిలోకి దించడంతో ఈ సారి రాష్ట్రపతి పదవికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఓటింగ్ కోసం మొత్తం రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, ఆయా రాష్ట్రాల శాసనసభ్యుల పేర్లను అక్షర క్రమంలో పొందుపర్చి ఎలక్ట్రోరల్ కాలేజి జాబితా విడుదల చేశారు. ఇందులో మొదటి, చివరి ఓటర్ల పేర్లు తెలుగు వారివి అవ్వడం ప్రత్యేకం. మొదటి పేరు తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవిదే కావడం విశేషం. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటరుగా చిరంజీవి ఓటు వేయనున్నారు. ఇక ఈ జాబితాలో చివరి పేరు కూడా తెలుగువారు పాండిచ్చేరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లాది కృష్ణారావు చిట్టచివరిదైన 4896వ స్థానంలో ఉన్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న చిరంజీవి ఎవరికి ఓటేస్తారన్నవిషయంపై అందరికి ఆసక్తి నెలకొంది. లోక్సభ స్పీకర్గా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి నేతృత్వం వహించిన విషయం తెలింసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతిని ఎన్నుకొనే విషయంలో ఇరుపక్షాలు ఎవరిని ఎన్నుకోబోతున్నారో వేచ్చి చూడాల్సిందేనని చెబుతున్నారు.