హైదరాబాద్, మార్చి 28 : అలనాటి నటి జయంతి శ్వాస సంబంధిత సమస్యతో ఆదివారం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జయంతి 35 సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆస్తమా కారణంగా ఆమె ఇన్హేలర్తో ఉపశమనం పొందేవారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బెంగుళూరులోని సిడ్విన్ హాస్పిటల్కు తీసుకువెళ్లగా.. డాక్టర్స్ సలహా మేరకు ఆమెను విక్రమ్ హాస్పిటల్కు తరలించినట్టు ఆమె కుమారుడు కృష్ణ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆమెను అబ్జర్వేషన్లో వెంటిలేటర్పై ఉంచినట్టు తెలుస్తోంది. ఇదిలాగా ఉండగా జయంతి చనిపోయినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ వార్తలను జయంతి కుటుంబం ఖండిస్తూ.. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆమె 500లకు పైగా చిత్రాలలో నటించారు. కన్నడ నటి అయిన జయంతి తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, మరాఠీ చిత్రాలలో నటించారు.