పని చేసి ఇంటికి కన్నం వేసిన మనిషి

SMTV Desk 2017-06-30 17:04:04  hydarabad, robbery, women

నాంపల్లి, జూన్ 30 : తాను పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే భారీ మొత్తంలో నగదు దొంగిలించిన ఓ నిందితురాలిని నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... నాంపల్లి రెడ్ హిల్స్ ప్రాంతానికి చెందిన పిరోజ్ హుస్సేన్ హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. బొల్లారం ప్రాంతానికి చెందిన షేక్ సబాబేగం (18), ఫిరోజ్ హుస్సేన్ ఇంట్లో పని చేస్తూ ఉండేది. ఆ ఇంట్లో వృద్దురాలైన అతడి తల్లికి సపర్యలు చేస్తూ వారి ఇంట్లో ఒక గదిలో ఉంటుంది. ఈ నెల 23న రాత్రి ఫిరోజ్ హుస్సేన్ రూ. 1.90 లక్షల సొమ్మును తన బెడ్ రూమ్ లో ఓ బ్యాగ్ లో ఉంచి ఆ బ్యాగ్ టేబుల్ పై పెట్టి నిద్రపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న షేక్ సబాబెగం ఆ నగదు మొత్తం కాజేసి టేర్రస్ పైన ఓ కవర్ లో దాచిపెట్టింది. ఫిరోజ్ హుస్సేన్ ఆ మాయమైన నగదు గురించి ఇల్లంతా వెతికాడు కాని ఫలితం లేకుండాపోవడంతో నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆ ఇంట్లో పనిచేస్తున్న షేక్ సబాబేగంను పోలీసులు విచారించగా తను చేసిన నేరాన్ని ఒప్పుకుంది. ఆ నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకొని నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.