హైదరాబాద్, మార్చి 27 : మన దేశంలో సినిమా, క్రికెట్ ఉన్నంత ఆదరణ ఇతర ఏ రంగానికి లేదంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఈ వేసవిలో సినిమాల జోరు, ఐపీఎల్ హోరు ప్రేక్షకులను ఉర్రుతలుగించడానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల ఏప్రిల్ 7న ప్రారంభమయ్యే ఐపీఎల్-11 తెలుగు ప్రసారాలకు ఎన్టీఆర్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. తెలుగులో స్టార్ మా ప్రసారం చేయనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషన్ బాధ్యతలను ఎన్టీఆర్ తీసుకోవటంతో తెలుగు ప్రసారాలకు మరింత క్రేజ్ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మాటీవీలో వచ్చిన బిగ్బాస్ షో కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అయితే రెండో సీజన్కు మాత్రం ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వచ్చే అవకాశం కనిపించటం లేదు. అందుకు కారణం ప్రస్తుతం యంగ్ టైగర్ త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. వచ్చే నెల 7న మొదలయ్యే ఈ మెగా టోర్నీలో ఆరంభ పోరులో చెన్నై సూపర్ కింగ్స్తో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది.