హైదరాబాద్, మార్చి 26 : యావత్ క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేసిన బాల్ టాంపరింగ్ వివాదంపై ప్రముఖ నటుడు సిద్ధార్థ్ నిప్పులు చెరిగారు. టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆసీస్ క్రికెటర్లు స్మిత్, డేవిడ్ వార్నర్లను క్రికెట్ నుంచి నిషేధించాలని అన్నారు. ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్ట్ మూడోరోజు బాల్ ఆకారాన్ని మార్చేందుకు ఆసీస్ ఆటగాడు బాన్ క్రాఫ్ట్ యత్నించి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఆట ముగిశాక ఆస్ట్రేలియా సారథి స్మిత్ మీడియా ముఖంగా తన జట్టు తప్పును ఒప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ఆసీస్ను ఉద్దేశిస్తూ.."ఆస్ట్రేలియా క్రికెటర్లు చీట్ చేస్తూ పట్టుబడ్డారు. కానీ వారిని యజమాని కుమారుల్లా చూస్తున్నారు. వారు చేసిన పనికి ఇప్పుడు వేసింది చాలా చిన్న శిక్ష. ఖండాంతర క్రికెట్ జట్టులు ఏ తప్పూ చేయకపోయినా వారిని కఠినంగా శిక్షిస్తుంటారు. కోచ్ లిమన్, స్మిత్, వార్నర్, బాన్ క్రాఫ్ట్ లను క్రికెట్ నుంచి నిషేధించాలి. క్రికెట్ని నాశనం చెయొద్దు ఆస్ట్రేలియా" అని ట్వీట్ చేశారు.