హైదరాబాద్, జూన్ 30 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 21న పర్యటనకు వెళ్లిన కేసీఆర్ 23న రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు ప్రక్రియలో భాగంగా హాజరయ్యారు. కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి వారం రోజులపాటు ఆయన అక్కడే గడిపారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించి రెండుసార్లు డాక్టర్లు వాయిదా వేశారు. కేసీఆర్ బీపీ, షుగర్ లెవల్స్ కంట్రోల్ కాకపోవడంతో ఆపరేషన్ మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. ఇదే సమయంలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రులందరిని ఆహ్వానిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారనే కథనాలు కూడా వచ్చాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఎవరిని ఆహ్వానించలేదని తెలియడంతో, ఈ మేరకు శుక్రవారం రాత్రి జరుగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కావడంలేదని సమాచారం. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన విజయవంతమైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కదిలించడంలో సీఎం కీలక పాత్ర పోషించారు. అలానే రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ ఎంపికలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా వ్యవహరించారు. ఆయన సూచన మేరకే దళిత అభ్యర్థిని బీజేపీ బరిలోకిదించిందని, దాంతో కోవింద్ నామినేషన్ దాఖలులో కేసీఆర్ పాల్గొని, వాస్తు ప్రకారం నామినేషన్ ను దాఖలు చేయించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. జోనల్ రద్దు ఫైలును జూలై మొదటి వారంలో పంపిస్తున్నట్లు ఢిల్లీ పెద్దలకు సమాచారం ఇచ్చిన ఆయన.. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని, మూడంచెల వ్యవస్థను రద్దుచేసి, రెండంచెల వ్యవస్థనే కొనసాగించనున్నట్లు గుర్తు చేశారు.