న్యూఢిల్లీ, మార్చి 25: ఆధార్ సమాచారం సురక్షితంగా ఉందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) మరోసారి వివరించింది . పలువురి ఆధార్ కార్డుల వివరాలు, వారి బ్యాంకుల వివరాలకు సంబంధించిన సమాచారం లీకైందని ఓ న్యూస్ వెబ్సైట్ ప్రచురించిన వార్తపై ఉడాయ్ శనివారం స్పందించింది. ఆధార్ డేటా భద్రంగా ఉందని, ఎటువంటి సమాచారం లీక్ కాలేదని ఉడాయ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మీడియా ప్రచురించిన కథనంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఓ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ ఆధార్ వివరాలు బయటకు వచ్చిన విషయాన్ని గుర్తించినట్లు సదరు వెబ్సైట్ వార్తను ప్రచురించింది. 12 అంకెల ఆధార్ నంబరు, బ్యాంకుల వివరాలు, ఏయే వాటికి ఆధార్ అనుసంధానం చేసుకున్నారనే దానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. దీంతో ఆధార్ భద్రతపై మరోసారి అనుమానాలు రేకెత్తే ప్రమాదం ఉందని భావించిన ఉడాయ్ దీనిపై వివరణ ఇచ్చింది.