న్యూఢిల్లీ, మార్చి 24: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఊరట లభించింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో ఏప్రిల్ 16 వరకు ఆయనను అరెస్ట్ చేయకుండా.. స్పెషల్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ సీబీఐ జడ్జి ఓపీ సైని, షరత్తులతో కూడిన ఈ ముందస్తు బెయిల్ను మంజూరు చేశారు. ఈ కేసులో ఎప్పుడు సమన్లు జారీచేస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని జడ్జి తెలిపారు. కార్తీ చిదంబరం ముందస్తు బెయిల్ ఫిర్యాదులపై మూడు వారాల్లోగా స్పందించాలని సీబీఐ, ఈడీని కోర్టు ఆదేశించింది. అయితే.. సీబీఐ అధికారులు ఎప్పుడు విచారణకు రమ్మని సమన్లు పంపిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 16కి వాయిదా వేసింది.