మైసూరు, మార్చి 21: కర్ణాటకలో రానున్న విధాన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తున్నట్టు ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత మాళవిక అవినాశ్ తెలిపారు. మైసూరులోని కే.ఆర్ నియోజక వర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కే.ఆర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇవ్వాలని బీజేపీ పార్టీ నేతలను కోరనున్నారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం, రాష్ట్ర నేతలు సానుకూలంగా స్పందిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా 2013 లో బీజేపీలో చేరిన మాళవిక అప్పటి నుంచి పార్టీలో చురకుగా పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మాళవిక పోటీ చేస్తుందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ వచ్చినా ఆమె స్పందించలేదు. అయితే తొలిసారి తాను పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు మాళవిక ప్రకటించారు.