అమరావతి, మార్చి 21 : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టి.. మరోవైపు ప్రధాని కార్యాలయంలో ఎందుకు తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. కేసుల నుంచి బయటపడేందుకే పీఎంఓలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. వైసీపీ చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తూనే ఉంటారని ఆయన అన్నారు. చంద్రబాబు ఈరోజు టీడీపీ ఎంపీలతో కలసి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడిన విషయాలు జనాలు అర్థం చేసున్కున్నారని.. దేశ రక్షణ, సైన్యం నిధులను తాము అడిగామని జైట్లీ చేసిన తప్పుడు ప్రకటన జనాల్లో ఆవేశాన్ని పెంచిందని అన్నారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై తెలుగువారంతా అట్టుడికినట్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలంతా కలసి పోరాడాలని సూచించారు. అవిశ్వాసంపై చర్చను జరపడం తప్పా.. కేంద్ర ప్రభుత్వానికి మరో దారి లేదని అన్నారు.