హైదరాబాద్, మార్చి 21: ఇప్పటివరకు ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ రెండు దశలుగా నిర్వహించిన ఉన్నత విద్యా మండలి.. ఇకపై మూడో దశ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈ మేరకు తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా మూడో దశ కౌన్సెలింగ్ లేకపోవడంతో టాప్ ర్యాంకర్లు కూడా స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీల్లో చేరాల్సి వస్తోందని గుర్తించింది. అంతేకాదు వేల మంది విద్యార్థులు కాలేజీల్లో మిగిలిపోయే సీట్లలో స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా చేరడంతో టాప్ ర్యాంకర్లతోపాటు వారికి ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం వర్తించడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఇతర జీఎఫ్టీఐలలో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) నిర్వహించే ఏడు దశల కౌన్సెలింగ్ నిర్వహణ పూర్తయ్యాక ఎంసెట్ మూడో దశ (చివరి దశ) ప్రవేశాల కౌన్సెలింగ్ను నిర్వహించాలని యోచిస్తోంది.