న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెందుల్కర్ లేఖ రాశారు. నాణ్యత లేని హెల్మెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సచిన్ మంత్రిని కోరారు. నాణ్యతలేని మెటీరియల్తో హెల్మెట్లు తయారు చేసి వాటిపై ఐఎస్ఐ మార్కు వేస్తున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోండి. క్రికెటర్గా నాకు హెల్మెట్కు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసు. మైదానంలోకి బ్యాటింగ్ చేసే సమయంలో మేము భద్రత కోసం నాణ్యమైన హెల్మెట్లు వాడతాం. అంతటి నాణ్యమైన హెల్మెట్లనే ద్విచక్రవాహనదారులు ధరించాలి. దేశంలో 70శాతం మంది ద్విచక్రవాహన దారులు నకిలీ ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లనే కొంటున్నారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 30 శాతం ద్విచక్రవాహనాల కారణంగానే జరిగాయి. నాణ్యతలేని హెల్మెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై వెంటనే చర్యలు తీసుకోండి’ అని లేఖలో సచిన్ పేర్కొన్నాడు.