2జీ తీర్పు పై హైకోర్టులో సీబీఐ సవాల్

SMTV Desk 2018-03-20 17:02:15  Cbi, appeal, 2g case, in delhi, high court

న్యూఢిల్లీ, మార్చి 20: మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను 2జీ కుంభకోణంలో నిర్ధోషులుగా వెల్లడించిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీబీఐ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రాజా, కనిమొళితో పాటు 17 మంది నిందితులకు ఈ కేసు నుంచి ప్రత్యేక న్యాయస్ధానం గత ఏడాది డిసెంబర్‌ 21న విముక్తి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసు తీర్పును సోమవారం హైకోర్టులో ఈడీ సవాల్‌ చేయగా..తాజాగా సీబీఐ అప్పీల్‌ చేసింది. డీఎంకే నిర్వహిస్తున్న కళైంగర్‌ టీవీకి స్వాన్‌ టెలికాం ప్రమోటర్లు రూ 200 కోట్లు చెల్లించారని ఈడీ తన చార్జిషీట్‌లో ఆరోపించగా, 2జీ కేటాయింపుల్లో సర్కార్‌ ఖజానాకు రూ 30,984 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ ఘోరంగా విఫలమైందని ప్రత్యేక న్యాయస్ధాన న్యాయమూర్తి ఓపీ సైనీ పేర్కొంటూ నిందితులపై అభియోగాలను కొట్టివేశారు.