కొలంబో, మార్చి 20 : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక అభిమానుల హృదయాలను గెలుచుకొన్నాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో ఫైనల్లో తలపడిన రోహిత్ సేన గెలుపొందిన సంగతి తెలిసిందే. చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సిన తరుణంలో టీమిండియా కీపర్, దినేష్ కార్తీక్ సిక్స్ కొట్టి భారత్ కు చిరస్మరణీయ విజయం అందించాడు. మ్యాచ్ అనంతరం విజయోత్సాహంతో ఆటగాళ్లు మైదానం అంతా తిరిగారు. సాధారణంగా ఏ టీం ఆటగాళ్లు అయిన విజయం తర్వాత తమ దేశ జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని తిరుగుతుంటారు. కానీ ఆదివారం రోహిత్ శర్మ శ్రీలంక జాతీయ పతాకాన్ని పట్టుకుని మైదానంలో తిరిగాడు. అంతే శ్రీలంక అభిమానులు ఒక్కసారిగా సంతోషంలో మునిగిపోయారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లకోడుతుంది. భారత్ సారథి తీరుపై నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.