విశాఖపట్నం, మార్చి 19 : బీజేపీ, పవన్ కళ్యాణ్ అండదండలతోనే ఆనాడు టీడీపీ అధికారంలోకి వచ్చిందని విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు వ్యాఖ్యానించారు. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన విష్ణు.. ఈ సందర్భంగా మాట్లాడారు. మిత్రపక్షం కాబట్టే ఇంతకాలం టీడీపీ వ్యవహారంలో సంయమనంతో ఉన్నామన్నారు. బీజేపీ, పవన్ అండదండలతోనే చంద్రబాబు సీఎం అయ్యారు. లేదంటే జగన్ సీఎం అయి.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండేవారని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీయే ప్రతిపక్ష పాత్రను పోషిస్తోందన్నారు. టీడీపీ నేతల అవినీతి బాగా పెరిగిపోయిందని, ఇసుక మాఫియాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ ఏడాదే విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు అవుతుందని వెల్లడించారు.