బెంగళూరు, మార్చి 18: టీమిండియా క్రికెటర్ ధోని, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్సీ ఐఎస్ఎల్ ( ఇండియన్ సూపర్ లీగ్) లీగ్ లో మళ్లీ విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ రేస్ లోకి వచ్చిన కొత్త జట్టు బెంగళూరు ఎఫ్సీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. బ్రెజిలియన్ ఆటగాళ్లు మెల్సన్ అల్వెస్ రెండు గోల్స్, రాఫెల్ ఆగస్టో ఒక గోల్ చేసి చెన్నైయిన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొత్తం నాలుగు సీజన్లలో రెండుసార్లు అథ్లెటికో డి కోల్కతా విజేతగా నిలవగా, మరో రెండుసార్లు చెన్నయిన్ కప్పు సొంతం చేసుకుంది. 2014లో ప్రారంభమైన ఐఎస్ఎల్లో ఈసారి అత్యధికంగా 10 జట్లు టైటిల్ పోరులో నిలబడ్డాయి. బెంగళూరు, జంషెడ్పూర్ కొత్తగా లీగ్లోకి వచ్చి చేరాయి. మ్యాచ్ తర్వాత జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో బెంగళూరు ఎఫ్సీ స్టార్ ఆటగాడు సునీల్ చెత్రి ‘హీరో ఆఫ్ ద లీగ్’, గోవా ఫార్వర్డ్ ఆటగాడు ఫెర్రాన్ కొరొమినస్కు ‘గోల్డెన్ బూట్’, ఉదంత (బెంగళూరు) ‘పాస్ ఆఫ్ ద సీజన్’, కాల్డరన్ (చెన్నైయిన్) ‘ఫిటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’, లాల్రుతర (కేరళ బ్లాస్టర్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డులను దక్కించుకొన్నారు.