ముంబై, మార్చి 18: పీఎన్బీ కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి మరో భారీ షాక్ తగిలింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో నీరవ్కు చెందిన భూములను.. రైతులు ‘తిరిగి స్వాధీనం’ చేసుకున్నారు. నీరవ్కు చెందిన ఫైర్స్టార్ సంస్థ కొన్నేళ్ల క్రితం వీటిని రైతుల నుంచి కొనుగోలు చేసింది. పీఎన్బీకి రూ.11.4వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన అతడు.. విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ జప్తు చేసిన నీరవ్ ఆస్తుల్లో ఖండాలాలోని ఈ భూములు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు తక్కువ ధరలకే తమ భూములను నీరవ్ పొందాడని ఆరోపిస్తూ.. దాదాపు 200 మంది రైతులు ఇక్కడకు చేరుకుని శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొంత మేర భూభాగాన్ని ట్రాక్టర్తో దున్నారు. త్వరలోనే మొత్తం 125 ఎకరాలను సాగు చేసుకుంటామని రైతులు పేర్కొన్నారు.