చంఢీఘడ్, మార్చి 17: నిబంధనలను తుంగలో తొక్కి విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఓ ఐపిఎస్ అధికారిణి పై కేసు నమోదైంది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2012 ఏప్రిల్ నుంచి 2014 ఆగస్టు వరకు గురుగ్రామ్ తూర్పు డిసిపిగా అధికారిణి నజ్నీన్ భాసిన్ పనిచేశారు. ఈ అధికారిణి తన అధికార౦తో 28 నెలల పాటు విద్యుత్ను అక్రమంగా వాడుకొని రూ.3.9లక్షల బిల్లును ఎగవేసిందని, సామాజికవేత్త హరీందర్ థింగ్రా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోకాయుక్త ఆమెకు నోటీసు జారీ చేయగా, తాను విద్యుత్ చౌర్యానికి పాల్పడలేదని, తాత్కాలికంగా బ్యాటరీ సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగించుకున్నానని అన్నారు. అధికారిణి నేరుగా విద్యుత్ స్తంభం నుంచి తీగలు కలిపి విద్యుత్ చౌర్యానికి ప్పాలడిందని ఏసిబి పరిశీలనలో తేలినందున ఆమెపై కేసు పెట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని హర్యానా లోకాయుక్త ఆదేశించింది.