న్యూఢిల్లీ, మార్చి 16: పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల నోటును రద్దుచేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. నోట్లు ఉప సంహరించుకుంటారని వస్తున్న కథనాలను కేంద్రం తోసిపుచ్చింది. 2000 వేల రూపాయల నోట్లు రద్దు చేయాలన్న ప్రతిపాదన లేదని శుక్రవారం లోక్సభకు వెల్లడించింది. పది రూపాయల ప్లాస్టిక్ కరెన్సీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. తొలుత ఐదు నగరాల్లో పది రూపాయల ప్లాస్టిక్ కరెన్సీ చలామణిలోకి తెస్తామని లోక్సభకు తెలిపింది.‘రూ. 2000 నోట్లు రద్దు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలోనే లేదు’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పీ రాధాకృష్ణన్ వివరించారు. పెద్దనోట్లు రద్దు చేస్తారంటూ వచ్చిన వార్తలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.