న్యూఢిల్లీ, మార్చి 16 : జాతీయ గీతంలో మార్పులు చేయాలని కోరుతూ.. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. జాతీయ గీతంలో "సింధ్" అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో "ఈశాన్యం" అనే పదాన్ని చేర్చాలని కోరారు. భారత్లో ఈశాన్య ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉందన్న రిపున్.. జాతీయ గీతంలో మాత్రం దాని ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం రిపున్ మాట్లాడుతూ.. "సింధ్ ప్రస్తుతం భారత్కు బద్ధ శత్రువైన పాకిస్తాన్లో ఉంది. కావున జాతీయ గీతంలో "సింధ్" అనే పదాలను తొలగించి "ఈశాన్య భారతం" గా సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా" అంటూ పేర్కొన్నారు. ఆనాడు లోక్సభలో ఇదే విషయంపై 2016 వ సంవత్సరంలో శివసేన ఎంపీలు సైతం ఈ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.