న్యూఢిల్లీ, మార్చి 16: కేంద్రప్రభుత్వంపై తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ లోకసభలో చదివి వినిపించారు. అవిశ్వాస తీర్మానాలు తనకు అందాయని..వాటికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారన్న దాన్ని పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని స్పీకర్ చెప్పడంతో కాంగ్రెస్, సీపీఎం సహా వివిధ పార్టీల సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. సభ సజావుగా జరిగితేనే వీటిని ప్రవేశపెట్టగలమని పేర్కొన్నారు. గందరగోళ పరిస్థితులు నెలకొంటే తీర్మానాలను తీసుకురాలేమని స్పష్టం చేశారు. దీంతో వాటిపై చర్చ చేపట్టేందుకు స్పీకర్ సిద్ధమైన సమయంలో తెరాస, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టాల్సి ఉన్నందున ఆందోళన విరమించాలని స్పీకర్ నచ్చజెప్పినా వారు వినకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.