హైదరాబాద్, జూన్ 28 : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(కేసీఆర్), మున్సిపల్ శాఖామంత్రి కె. తారక రామారావులపై (కేటీఆర్) భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్ నగారాన్ని సింగపూర్ లా అభివృద్ధి చేస్తామన్న కేసీఆర్ గాలిలో మేడలు కట్టడమే తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తూ హైదరాబాద్ కూడా అలాగే ఉన్నట్లు భావిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాలలో కేటిఆర్ పై హాస్యాస్పద అంశాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం లోపించినందువల్ల నగరంలో కొన్ని ప్రదేశాలలో వారానికి ఒక సారి కూడా మంచి నీళ్ళు రావడం లేదని, మెట్రో రైలు పనులలో జాప్యం కొనసాగుతుందని కిషన్ రెడ్డి అన్నారని సమాచారం.