న్యూఢిల్లీ, మార్చి 15: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో కుంభకోణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. నేడు మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పీఎన్బీ ముంబయి బ్రాంచ్లో తొమ్మిది కోట్ల కుంభకోణం బయటపడింది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ ఛోక్సీలు రూ.12 వేల కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు పీఎన్బీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఎల్ఓయూల పేరిట సాగిన ఈ దందాపై పీఎన్బీ గతనెల 14న సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణం బహిర్గతమవుతున్న నెలరోజుల ముందే నీరవ్ మోదీ సహా ఆయన కుటుంబ సభ్యులు దేశం విడిచి వెళ్లిపోయారు.