అమరావతి, మార్చి 15 : జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్.. టీడీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు బీజేపీ, మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఏపీ ప్రజల డిమాండ్ లను పరిష్కరించాల్సింది పోయి.. ఇలా వైకాపా నేత జగన్ ను, జనసేన అధినేత పవన్ ను అడ్డుపెట్టుకొని టీడీపీపై విమర్శలు గుప్పించడం వెనుక ఉన్న బీజేపీ వైఖరి ఏంటో అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా యాంటీ మోదీ, యాంటీ బీజేపీ అన్న భావన ప్రజలలో బలంగా ఉంది. ఇందుకు నిదర్శనం నిన్న యూపీ, బీహార్ ఉపఎన్నికలు మంచి ఉదాహరణ" అంటూ వెల్లడించారు. నిన్న యూపీ, బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది.