బీసీలు ముందుకెళితేనే అభివృద్ధి : భట్టివిక్రమార్క

SMTV Desk 2018-03-11 16:50:41  bhatti vikramarka, bc community, congress obc cell meeting.

మహబూబ్‌నగర్‌, మార్చి 11 : బీసీలు సమష్టిగా ముందుకెళితేనే అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్‌ నగర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ సెల్‌ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బీసీలు ఆర్ధిక, సామాజిక, విద్య, ఉద్యోగాల వంటి అన్ని రంగాల్లో ముందున్నారు కానీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని దశాబ్దాల వెనక్కు నెట్టిందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. కాంగ్రెస్ ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీసీ విద్యార్ధుల్ని ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించామని, దాంతో వార౦తా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలను తీసుకువస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీలకు గొర్రెలు.. బర్రెలు అంటూ తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. బీసీలు సమష్టిగా ముందుకు వెళితేనే ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఎదుగుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.